Friday, December 2, 2016

మార్గశిర మాసం - లక్ష్మీ నారాయణుల ఆవాసం!


ముందుమాట:

గత మాసం అంతా కార్తీక మాస వైభవం గురించి తెలుసుకుని, హరిహరులను మనసారా కొలుచుకుని, కార్తీక స్నానాలు, దీపాలు, దానాలు, అభిషేకాలు మొన్నగు కార్యక్రమాలతో తరించి, ఉపవాసాల తో పునీతులమై, కొసమెరుపుగా షడ్రుచోపేతమైన వనసమారాధన తో అత్మేశ్వరుని కి నివేదన చేసి ఇప్పుడు, హేమంత ఋతువు లోని మొదటి మాసమైన పుణ్య మార్గశీర్షం లోకి అడుగు పెట్టాము. ఈ మాసం యొక్క విశిష్టత గురించి, పర్వ దినాల గురించి శ్రీమతి నయన విపులంగా మన ముందుకు తెస్తున్నారు.


సంపాదకుడు

రమణ బంధకవి



మార్గశిర మాసం - లక్ష్మీ నారాయణుల ఆవాసం!

శ్రీమతి నయన కస్తూరి


తెలుగు మాసాలలో తొమ్మిదవ మాసమైన మార్గశిర మాసం శ్రేష్టమైన మాసం .మార్గశిరపౌర్ణమి నాడు మృగశిరా నక్షత్రం పడటం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. కార్తీకం పరమేశ్వరునికి ప్రీతికరమైతే, మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది .ఆయన భక్తులకు ఎంతో పవిత్రమైనది.ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా మార్గశిరం అంటే తానే అని ప్రభోధించినట్టు ప్రతీతి..

'గాయత్రి చందా సమాహం
మాసానాం మార్గసోహం"అని చెప్పాడట '

అందుకే మార్గశిరానికి ఇంకొక పేరు కూడా ఉందిట. అది ఏమిటంటే 'అగ్రహాయన'అగ్ర అనగా అగ్రజుడు ఆయన అనగా ప్రయాణం . సూర్యుని సంక్రమణం జరిగె సమయం కానక ఆ పేరు వచ్చింది. దాని గురించి కూడా తదుపరి ప్రస్తావించుకుందాం.

.శ్రీ కృష్ణ భగవానుడు గీత లో సెలవిచ్చిన ప్రకారం పృథ్వి మీది మానవులకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. మరి ఇక అందులో మార్గశిర మాసం ఆ రోజులోని బ్రహ్మి ముహూర్తం గా దేవతల చేత భావించబడే సమయం . రోజులో బ్రాహ్మి ముహూర్త సమయం యొక్క వైశిష్టత మనం చదువుకునే వున్నాం . ఆ సమయం పవిత్రమైన దైవకార్యాలు మాత్రమే ఆచరించవలసిన సమయం . ఆ సమయం లో చేసే ఏ చిన్న పవిత్ర కార్యమైనా ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది .

ప్రతి తెలుగు సంవత్సరంలో వచ్చే మార్గశిరం యొక్క పవిత్రత ప్రాధాన్యత లను తెలుసుకుందాం. ఈ సంవత్సర నవంబర్ 30 నుండి డిసెంబర్ 29 వరకు వరకు మార్గశిరమాసం కలదు. నిన్న మొన్నటి వరకు కార్తీకమాసం లో శివ సాన్నిధ్యం కోసం ఎలా సాధన చేసామో మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుటకై ఈ మార్గశిరమాసం మనకు ఎంతో చక్కటి అవకాశాన్ని చూపుతున్నాయి.

సూర్యోదయానికి ముందే స్నాన మాచరించి, దీపారాధన చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతాము. విష్ణువాలయ దర్శనం భోగభాగ్యాలను సంప్రాప్తిస్తుంది. నారాయణ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని కూడా కొలుచుకుంటారు . నిత్యం విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణము చేసుకుంటే మహా విష్ణువు యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మార్గశిర మాసం లో లక్ష్మీ దేవియొక్క ఆరాధన కూడా ఎంతో విశిష్టమైనది. తప్పక ఆచరించతగ్గది . అష్టైశ్వర్యప్రాప్తికి కారకమైనది. మార్గశిర మాసం లోని లక్ష్మీ వారాలనాడు మార్గశిరలక్ష్మి నోమును చేసుకుంటారు . దీని గురించి మనకు స్త్రీల వ్రతకథ పుస్తకాలలో వివరంగా ఇవ్వబడి ఉంటుంది .వైజాగ్ లోని కనకమహాలక్ష్మి ఆలయం లాంటి లక్ష్మీ దేవి ఆలయాలలో విశేష అలంకారాలు పూజలు జరుపబడతాయి అని మన లో చాలామందికి తెలిసిన విషయమే.

ఇక పొతే ఈ మార్గశిరం లో వచ్చే విశేషమైన పర్వదినాలను గురించి తెలుసుకుందామా మరి .మార్గశిర మాసం లోని ఆరవరోజున వచ్చే షష్టిని సుభ్రహ్మణ్య షష్టి అని స్కంద షష్టి అని పిలుచుకుంటూ ఆ రోజు సుభ్రహ్మణ్యేశ్వరుని విశేష ఆరాధన జరుగుతుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం సంతానం కోసం ఈ ఫాలనేత్రసుతుని భక్తిశ్రద్హలతో కొలుచుకుంటారు. హిందూ స్త్రీలకు ఎంతో పవిత్రమైన సుబ్బారాయుడి షష్టి గురించి ప్రత్యేక వ్యాసం లో తెలుసుకుందాం . ఈ షష్టి పండుగ డిసెంబర్ 5 న మనమంతా భక్తి శ్రద్హలతో జరుపుకుందాం.

షష్టి మరునాడు అనగా డిసెంబర్ 6 న వచ్చే సప్తమి ని మిత్రసప్తమి అని పిలుచుకుంటూ సూర్యభగవానుని ఆరాధిస్తారు. . ఇక త్రయోదశినాడు శ్రీహనుమద్ వ్రతంజరుపుకుంటారు. హనుమంతుడికిష్టమైన తమలపాకులతో పూజ చేసి వడమాలలతో అలంకరించి అప్పాలు నివేదన చేస్తారు. ఈ మార్గశిరం లో హనుమద్ వ్రతం డిసెంబర్ 12 న పడిందది మరి .

ఇక మార్గశిర పౌర్ణమి నాడు శ్రీ దత్తజయంతి ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశి లోకి ప్రవేశించిన రోజు నుండి ఒక నెల రోజులను ధనుర్మాసం అంటారు. ఈ పవిత్రమైన సంక్రమణం ఈ మార్గశిర పౌర్ణమి నాడు సంభవించడం ఈ మాసం యొక్క విశిష్టత. ధనుర్మాసం విష్ణు మూర్తికి ఎంతో ప్రియమైన రోజులు . నెల రోజులు విష్ణుమూర్తికి విశేష పూజలు ప్రసాదాలు చేయబడుతూ ఉంటాయి. నారాయణుని మందిరాలు భక్తులతో నిండి పోయి ఉంటాయి .సూర్యోదయానికి ముందే తిరుప్పావై శ్రీవ్రతం పారాయణం జరుగుతాయి . ఈ సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ 16 నుండి జనవరి 15 దాకా ఉంటుంది . అప్పుడు ధనుర్మాసం గురించి అప్పుడు పారాయణం చేసుకునే తిరుప్పావై సప్తపదులు గోదాకల్యాణాల గురించి మరింత వివరం గా ముచ్చటించుకుందాం.

నారాయణుడు భోగస్వరూపుడు. మార్గశిరమాసం లో సూర్యోదయానికి ముందే పూజ చేసి భోగం నివేదన చేస్తారు. పులిహార , కట్టె పొంగలి, దద్దోజనం, సుండలు, చక్కర పొంగలి. బెల్లం పొంగలి వడపప్పు పానకం లాంటి నివేదనలు సమర్పించుకుంటారు. వీటిని బహు కమ్మగా తయారు చేసుకునే విధానాలు తెలుగు భోజనము నుండి మీరు లోగడే నేర్చేసుకున్నారు కదా ? ఇకనేమి వాటిని చేసుకుని భగవంతునికి ఆరగింపు చేసుకోండి మనసారా.

ఈ విధంగా ఈ పవిత్రమైన మార్గశిర మాసం విష్ణుమూర్తి తో పాటు నారాయణ స్వరూపుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ని, సుభ్రహ్మణ్య స్వామిని,సూర్యనారాయణ మూర్తి ని , శ్రీ దత్తాత్రేయుల వారిని కొలుచుకుని పునీతులమవుదాము.

స్వస్తి!



Monday, November 28, 2016

కార్తీక వన సమారాధన అనే దివ్య భోజన యజ్ఞం!


రమణ బంధకవి 

"కార్తీక మాసం లో ఈ సారి తప్పకుండ వన భోజనం ఏర్పాటు చెయ్యాలి రా తమ్ముడు" అని గట్టి గా నొక్కి చెప్పింది వాణి అక్క.
"బావా ఈ సారైనా బావగాడి భోజనం లాంటి భోజనం పెట్టించాల్సిందే" అన్నాడు గోపాల్ బావ.
నాకు కార్తీక వన భోజనం అనగానే, మెరుపు లాగ గుర్తుకు వచ్చేది, శంకరం మంచి గారి అమరావతి కథలలోని బావగాడి వన భోజనమే! ఎప్పుడైనా సరే అలాగే భోజనం పెట్టిన్చాలనేది నా చిరకాల కోరిక. కానీ ఇంతవరకు అది తీరలేదు. మా బావలందరికీ నా ఈ కోరిక పరిచితమే అవటం తో ఎప్పుడూ బావ గాడి భోజనం అని నన్ను ఊరిస్తూ ఉంటారు. కాని ఈ సారి అనుకోని వర్షం లా అటువంటి అవకాశం ముంచుకొచ్చింది.
మా కాలనీ లో ఎవరో మాకు 50 km దూరం లో మాంచి మామిడి తోట వుందని, మంచి నీడ, జల వసతి ఉన్నాయని, చాలామంది బృందాలు అక్కడ వన భోజనాలు చేసుకుంటారని ఇత్యాది భోగట్ట నా చెవిని వేసారు. మా శ్రీమతి కూడా ప్రోత్సహించటంతో మా వాళ్ళందరి అంటే, అస్మదీయులకు 'వాట్స్అప్' లో సమాచారం హుటాహుటిని పంపించా. ఇష్టమైన వాళ్ళు లొట్టలు తో ప్రతిస్పందించాలని వ్రాశా. ఇక చూద్దురు! రాత్రి పొద్దుపోయేదాకా ఏక లోట్టల శబ్దంతో ఫోన్ మార్మోగి[పోయింది.
అందరు అనుకున్న రోజు కు రెండు రోజులు ముందరే మా ఇంటి దగ్గర గుమి కూడేరు, వాణి, భాస్కర్ బావ, గోపాల్, శ్రీను,శివ, శేఖర బావలు, వాళ్ళ వాళ్ళ శ్రీమతులు, వాళ్ళ రెండు జెళ్ళ సీతలు, నల నీలులు మొదలగు వానర సేన తో దండు వెడలి వచ్చారు. ఈ దండుకు మా నరసింహ రావు తాత గారు జాంబవంతాది వృద్ధ వీరుల వలె పెద్దరికం వహించారు.
రాత్రి ఫలహారాలు అయ్యాక, వన భోజనానికి వంటలు ఏమి చేయించాలో అనే పెద్ద చర్చ దండు ముందు ప్రతిపాదించాను. 500, 1000, రూపాయలు రద్దు పై, పార్లమెంట్ లో రేగిన దుమారం లా ముందు లేత పాకం తో మొదలై, తీగ పాకం లాగ సాగి, ఆఖరికి జీడి పాకం లాగా బిగదీసుకుని కూర్చుంది.
ముందు పప్పు మీద చర్చ. మామిడికాయ పప్పు అని కొందరు, అబ్బ పుల్లగా వుంటుంది, దోసకాయ పప్పు అయితే బెహతరు అని ఇంకొందరు, ఆకు కూర పప్పు అయితే మినరల్స్ బాగా ఉంటాయని శేఖర్ బావ, ముద్ద పప్పు, ఆవకాయ అయితే భేషుగ్గా ఉంటుందని గోపాల్ బావ వాగ్యుద్దానికి దిగారు. ఈ యుద్ధ వాతావరణానికి భయపడి, నా మనసులోని బావగాడి వాక్కాయ పప్పు ను గొంతులోనే నొక్కేసాను.
ఇంతలో మరి కూరల మాటేమిటి? అని భాస్కర్ బావ పాయింట్ అఫ్ ఆర్డర్ లేవనేట్టేడు. వంకాయ కూర మీద ఏకాభిప్రాయం ఏర్పడినా , ఏ రకం వంకాయ, అనగా తెల్లగా పొడుగ్గా వుండేవా, తెల్లగా రౌండ్ గ ఉండేవా, నల్లగా పొడువుగా ఉండేవా, నల్లగా రౌండ్ గా ఉండేవా? అన్న మౌలికమైన ప్రశ్నే కాక, దానిని పొడుం కూరి గుత్తిగా వండాలా, అల్లం మిర్చి కొత్తిమెర దట్టించి ఇగురు గా వండాలా, లేక మెంతికారం వెయ్యాలా, అనే మీమాంశ నుండి బయటపడటానికి చాలా సేపు జరిగింది. ఇక పచ్చడి మాట కొస్తే, దోసకాయా, కొబ్బారా, బీరకాయా, మామిడి-కొబ్బరి పచ్చడా అనే వాటిపై వేడి వాదాలు, ఇక గుమ్మడి కాయ ముక్కాలా పులుసా, దప్పళమా, సాంబారా, మజ్జిగ పులుసా అనే విషయం పై మల్లా గుల్లాలు, ఆలాగే ఇతర పదార్థాల విషయం చర్చించి ఒక కొలిక్కి వచ్చేప్పటికి అర్థరాత్రి దాటింది. మర్నాడు, రాత్రి జరిగిన నిర్ణయాలపై ఒక జాబితా తయారుచేసి, వంటవాళ్లకు అందించా. ఇక ఆ రోజు ఉదయం అల్పాహారం విషయం మాత్రం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టలేదు. అది సస్పెన్స్ అని చెప్పాను. వంటవాళ్లకు టిఫిన్ ఎక్కడ ఎన్నింటికి అందచేయ్యాలో చెప్పాను.
అనుకున్న రోజు రానే వచ్చింది. కోడి కూతలకు ముందే ప్రొద్దుటే, నాలుగు కార్ల లో బయలుదేరాం. ఇంకా పూర్తిగా వెలుగు రేకలు విచ్చుకోలేదు. చలి మంచు తెరలు అలవోకగా తోలుగుతున్నాయి. సూరీడు బద్ధకంగా లేచి కళ్ళు నులుము కుంటున్నాడు. అందరూ మంచి ఉల్లాసం గా ఉన్నారు. దారి, కొండలు, పొలాలు, తోటల మధ్య నుండి మెలికలు తిరిగి వెళ్తోంది. ఒక గంట ప్రయాణం సాగింది. ఇక వెనక కార్ల నుండి, టిఫిన్ ఎప్పుడు? ఏమిటి, ఎక్కడ ? అన్న ప్రశ్నలు శరపరంపరలాగా వాట్స్అప్ లో వస్తున్నాయి. ఓపిక పట్టండి అని చెప్పి, ముందుకు సాగెను.
కొంత దూరం వెళ్ళాక, కారు రోడ్డు ప్రక్కగా ఆపెను. అందరి కార్లు ఆగి, జనాలు బిల బిల మని వచ్చారు. "టిఫిన్ బ్రేక్" అని గట్టిగ అరిచాను. ఎక్కడ ఎక్కడ ? అని ఆదుర్దా గా అడిగేరు. కొంచెం దూరం లో ఉన్న టేకు తోపు చూపించాను. అందరూ, వంద మీటర్ల పరుగు పందెం లాంటిది పెట్టి టేకు తోపు లోకి చేరారు. అక్కడ మా వంట వాళ్ళు అప్పడికే, క్రింద జంపఖానాలు పరిచి, ప్లేట్స్ లో వేడి ఇడ్లి, వడ మరియు టమాటో ఉప్మా విత్ సెనగ చట్నీ, సాంబారు తో వడ్డించారు. జనాలు ఆకలి గొన్న పులుల్లా తిన్నారు. గొంతుకు దిగడానికి వేడి కాఫీ మధ్య మద్య లో తీర్థం లా పుచ్చుకుంటూ, ఒక్కోడు పుంజీడు ఇడ్లీలు, వడలు, రెండేసి రౌండ్ల ఉప్మా ముద్దలు భొంచేసారు.
అరగంట తరువాత పునః ప్రయాణం. కొండ దార్లు చుట్టుకుంటూ మరియొక గంట కి మేం నిర్నయిన్చుకున్న మామిడి తోపు కు జేరాము. ఇరవై ఎకరాల స్థలంలో శ్రద్దగా పెంచిన దాదాపు వెయ్యి మామిడి మరియు ఇతర ఫల వృక్షాలు ఉన్నాయి. మధ్యలో చక్కటి నీడ ప్రాంతంలో క్యాంపు వేసాము. జంపఖానాల మీద జనాలు జేరి, అంతాక్షరి ఆడేవాళ్ళు, పాటలు పాడుకునే వాళ్ళు, ఆటలు ఆడేవాళ్ళు కొందరు. ఇక గృహిణులు, అక్కడ ఉన్న ఉసిరి చెట్టు కింద, తులసి మొక్కను ఉంచి, పూజలు చేసి, ఉసిరి దీపాలు వెలిగించి, విష్ణు సహస్ర నామం, లలితా సహస్త్ర నామం పారాయణం చేసారు. ఇక పిల్లలు కొమ్మల మీద కెక్కి కోతి కొమ్మచ్చు లాడుకున్నారు.
అంతలో వంటవాళ్లు తమ సామగ్రి సంభారాలతో దిగేరు. దాంతో మగ బ్యాచ్ ఒక చెట్టుకింద జేరి వంటల గురించి మాటలు మొదలు పెట్టారు. మామిడికాయ కంది పప్పులో బావుంటుందా లేక పెసర పప్పా? చుక్కకూర పచ్చడా, పులుసా ఏది మహత్తరంగా వుంటుంది? వంకాయ బండ పచ్చడా లేక పులుసు పచ్చడా, ఏది కంది పచ్చడి లోకి నంచు కోవటానికి బావుంటుంది? దానిని పాటోలి లోకి కూడా నంజుకో వచ్చా? అన్నట్లు పొట్లకాయ పెరుగు పచ్చడి గురించి అభిప్రాయమేమిటి; ముక్కల పులుసులో చిలకడ దుంపల విశిష్టత ఏమిటి? ఇలా తర్జన భర్జన పడి, నోరు వూరి, కడుపులో ఆకలి ని ఎగదోసుకుని, అందరూ ఇక వడ్డనలు ఎప్పుడు, అని నా మీదకు దండెత్తారు. అయ్యా భోజన ప్రియులారా, కొంచెం ఓపిక పడితే షడ్రసోపేత భోజనం, మీ ముందు విస్తట్లోకి వేడిగా వస్తుంది. అంతవరకు శాంతించండి అని చెప్పి పంపెను.
ఒక అరగంట తరవాత, పులిహోర పళ్ళెం మీద పులుసు గరిటెతో టాంగ్ టాంగ్ మని కొట్టి వంటలు తయార్ అని వంటవాళ్లు ఏకగ్రీవంగా శబ్ద సంకేతాలు పంపేరు. జనాలు ఉలిక్కిపడి, చేస్తున్న వ్యాపకాలు పక్కన బెట్టి, సుప్రభాత దర్శనం కోసం, తలుపు తీయగానే గర్భ గుడి మీదకు ఎగబడే భక్త సందోహంలాగ వడ్డన ప్రాంతానికి పొలో మని వెళ్లారు. అక్కడ సన్నగా పరిచిన జంపఖాన ముందర, కడిగి, తుడిచిన పచ్చటి అరటి ఆకులు వేసారు. పక్కన మంచి నీటి గ్లాసులు పెట్టారు. జనాలు వారికీ నచ్చిన చోట లేదా, నచ్చిన ఆకు ముందర చతికిల పడ్డారు.
వడ్డన వాళ్ళు వరుసగా, పచ్చటి పులిహోర, ఎర్రటి బూరెలు, పచ్చి మిరపకాయ బజ్జి, పక్కన ఒక దొన్నె లో వేడి ఘుమ ఘుమ లాడే జీడిపప్పు పాయసం, మామిడి కాయ పప్పు, వంకాయ అల్లం మిర్చి కూర, అరటికాయ ఆవ పెట్టిన కూర, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, అప్పడాలు, వడియాలు వడ్డించారు. వేడి పొగలు గక్కే తెల్లటి అన్నం ఆకు మధ్యలో వడ్డించారు. కరిగిన ఆవు నెయ్యి ధారాళం గా వడ్డించారు. అందరు ఆపోసనలు పట్టి, ఆకలి మంటల్ని, అన్న యజ్ఞంతో చల్లార్చ ఉపక్రమించారు.
ఇక పులిహోర లోని పోపు గురించి, పప్పులోని మామిడికాయ పులుపు గురించి, బూరేలోని పూర్ణం గురించి, అందులో వేసుకున్న నేతి పరిమళం గురించి, మిర్చి బజ్జి ఘాటు గురించి, వంకాయ లేతదనం గురించి, వాటి తొడిమెల రుచి గురించి, దట్టించిన మిర్చి కారం పొగరు గురించి, పాయసం యొక్క దివ్యత్వం గురించి, అరటికూరలో పెట్టిన ఆవాల ఘాటు గురించి; ఒకటేమిటి, ఎన్నో విషయాలు కూలంకషంగా చర్చించుకుని, కథలు కథలు గ చెప్పుకుంటున్నారు. ఇంతలో ముక్కల పులుసు, దాని తదుపరి, కొబ్బరి పెరుగు పచ్చడి, అ పైన , కమ్మటి గడ్డ పెరుగు వడ్డనలకు వచ్చాయి. జనాలు మైమరచి తిన్నారు. మరీ మరీ మారు వడ్డించుకుని తిన్నారు. ఇంత అపూర్వమైన రుచికరమైన భోజనం, ఈ మధ్యకాలం జరిగిన పెళ్ళిళ్ళ లో కూడా తినలేదని శపథాలు పట్టేరు. అందరు అయిష్టంగానే ఉత్తరాపోసనం పట్టేరు.
ఇంత చక్కటి భోజనం పెట్టిన్చినందుకు నాకు ఎన్నో అభినందనలు తెలిపేరు. అప్పుడు నేను అందరిని, నేను చెప్పే ఆశీర్వచన వచనం మనస్పూర్తి గా చెప్పి లేవమన్నాను.." పాక కర్తా, తథా భోక్తా, అన్న దాతా శుఖీభవ!" . అందరు ఏక కంఠం తో గట్టిగా చెప్పారు.
ఇక భుక్తాయాసం తో ఆకు ముందు నుండి లేవలేక ప్రయాస తో లేచి చేయి కడుకుని చెట్ల కింద అసీనులయ్యారు. ఇంతలో చక్కటి తాంబూలం అందరికి అందింది. తాంబూల చర్వణం తరువాత అందరు చెట్ల నీడన గుర్రు పెట్టి పడుకున్నారు. సుమారు ఇదు గంటల ప్రాంతం లో అందరిని నిద్ర లేపి, కాఫీ టీ లు అందించి, వంట వారికీ ధన్యవాదాలు తెలిపి అందరూ గృహోన్ముఖం అయ్యాము. వెళ్ళే ముందరు అందరు, ప్రతి సంవత్సరం ఇలాగే వన(మనః) భోజనం పెట్టిస్తానని నా చేత మాట తీసుకున్నారు. అంతా "ఈశ్వర కృప" అని నమస్కరించి అందరికి ధన్యవాదాలు తెలిపెను.
ఈశ్వరార్పణం!




  
  

Sunday, July 5, 2015

నూల్ కోల్ పెసరపప్పు- కొబ్బరి కూర


శ్రీమతి రత్నా శ్రీనివాస్

నూల్ కోల్, ఆ కాయగూర గుణ గణాలు అదేనండి పోషక విలువలు ఇతరత్రా విషయాలు గురించి ముందు సంచికల్లో ప్రస్తావించడం జరిగింది. ఈ కాయగూర తో మన సంప్రదాయమైన పులుసు- బెల్లం కూర చేసుకోవటం కూడా చెప్పెము. ఇప్పుడు మరో సంప్రదాయమైన, ఎక్కువగా వాడుకలో నున్న పెసరపప్పు- కొబ్బరి తో పొడి కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం!

కావలసిన పదార్దములు :                      
నూల్ కోల్                                              :  దుంపలు
పెసరపప్పు                                            : 3  టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము                                      : 11/2 టేబుల్ స్పూను 
పచ్చి మిర్చి                                             : 4

పోపుకు కావలసినవి :
నూనె                                                         :  2 టేబుల్ స్పూన్స్ 
ఎండు  మిర్చి                                               :  2
ఆవాలు, జీల కర్ర                                           : చెరొక అర టీస్పూన్ 
ఇంగువ                                                       :  సువాసనకు 
కరివేపాకు                                                    :  3, 4 రెబ్బలు 
పసుపు                                                        : చిటికెడు 
ఉప్పు                                                          : తగినంత 


తయారు చేయు విధానం 
నూల్ కోల్ ని శుబ్రంగా కడిగి చెక్కు తీసి చిత్రంలో చూపించిన విధముగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక గిన్నెలో ముక్కలు వేసి తగినంత నీరు పోసి చిటికెడు పసుపు వేసి ప్రెజర్ పాన్ లో పెట్టుకోవాలి. పెసరపప్పు ని కూడా ప్రెజర్ పాన్ లో పెట్టుకోవచ్చు ముక్కలతో కలిపి. కాకపొతె బాగా వుడికిపోతే పప్పు ముద్ద అయిపోతుంది. పొడి పొడిగా కావాలనుకునే వారు వేరొక బాండీ లో కాని, గిన్నెలో కాని,  మైక్రో వేవ్ లో కాని పెసరపప్పు లో తగినంత నీరు పోసి పొడి పొడి లాడే లా వుడకపెట్టుకోవచ్చు.  ఒక విజిల్ వచ్చేక మంట తగ్గించి 5 నిమిషాలు  వుంచి, పెద్దది చేసి రెండో విజిల్ కి స్టవ్ ఆపెసుకోండి. 

పెసరపప్పు మూడు వంతులు వుడికేక  ఒక బాండీలో నూనె తీసుకుని  వేడేక్కేక పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోండి. ఆ పోపులో పెసరపప్పు ను వేసి కలియ బెట్టి వేయించుకోండి. ఈ లోగా ప్రెజర్ విడుదలై వుండి  వుంటుంది. నూల్ కోల్ ముక్కలను తీసి బాండీ లో వేసి కలిపి ఉప్పు వేసి మూత  పెట్టి మగ్గ నివ్వండి. నూల్ కోల్ ఉడక పెట్టినప్పుడు వచ్చిన అదనపు నీరుని చారులో కాని, పులుసు లో కాని వాడు కోవచ్చు. 

వుడికిన నూల్ కోల్ ముక్కలు కొంచెం, కాబేజీ, ముల్లంగి వుడికేటప్పుడు వచ్చే వాసనను పోలి వుంటుంది. అది కొందరికి గిట్టకపోవచ్చు. ఐతే నేమి దాని పోషక విలువలను చూస్తె, దాని వాసనను భరించటం కష్టమేమి  కాదు. అయినా ఆ వాసన ఎంత సేపు ఒక్క సారి వుడికిన ముక్కలను గుబాళించే ఇంగువ  పోపు లో పడే సామంటే చక్కదానల కమ్మటి వాసన రాదూ !

ఇప్పుడు ముక్కలు చక్కగా మగ్గి వుంటాయ.  పెసర పప్పు కూడా ఆ మిగిలిన వంతు కూడా వుడికేసి పొడి పొడి లాడుతూ వుంటుంది.  కొబ్బరి కోరు వేసి ముక్కలను సమానంగా కలపండి. ఒక్క సారి మంట పెద్దది చేసి మరొక్క సారి  కలిపి స్టవ్ ఆపెసుకోండి.

పొడి పొడి లాడే నూల్ కోల్ -పెసరపప్పు కొబ్బరి పొడి కూర తయారయి పోయింది . ఇది మీరు అన్నంలో చల్ల మిరపకాయలతో కాని, వడియాలతో కాని నంచుకుని తినవచ్చు . అలాగే చపాతీలలో కూడా చాల బావుంటుంది. ఒక సారి ప్రయత్నించండి మీరు కూడా!







కామాక్షి పుట్టినరోజు భోజనం!


ప్రియమైన పాఠకులకు

మొన్నీమధ్య మన కామాక్షి తన పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళింటికి భోజనానికి పిలిచింది. కామాక్షి ఇంటికి భోజనం అంటే ఇక చెప్పేదేముంది, తగిన ఏర్పాట్లతో వెళ్ళాలి. అందుకే ముందు రోజు రాత్రి అల్పాహారం తో సరిపెట్టుకుని, ఆ రోజు ప్రొద్దుట కూడా ఒకే అరటిపండు మాత్రం తీసుకుని, ఆవిడ తన పాక శాస్త్ర ప్రావీణ్యంతో, తయారుచేసి వడ్డించబోయే షడ్రసోపేతమైన భోజనం గురించి కమ్మటి పగటి కలలు కంటూ వారింటికి చేరాను.

గుమ్మంలోనే విశ్వనాధం గారు ఆదరంతో పలకిరించి లోనికి తీసుకు వెళ్లారు. పట్టూ అదే మన పట్టాభి ‘హాయ్ అంకుల్’  అంటూ తనదైన రీతిలో పలకరించాడు.  ఇంతలో పూజ గది నుండి లక్ష్మీకాంతం గారు, వంటగదినుండి సూరీడమ్మ గారు, మరి మన కామాక్షి వచ్చి కుశల ప్రశ్నలు వేసారు. విశ్వనాధం “నాన్నా వీరు ‘తెలుగు భోజనం’ బ్లాగ్ సంపాదకులు” అని పరిచయం చేసారు. వెంటనే “అయ్యోరామా! భోజనం చేసి వచ్చారా?” అని విస్తుపోయారు లక్ష్మీ కాంతం గారు.   “కాదు నాన్నా ‘తెలుగు ..తెలుగు భోజనం సంపాదకులు” అని కొంచెం గట్టి గా అన్నారు.  “ఏమిటీ తెలుగు రాదా ? మరి చెప్పవేం? సారి! హౌ ఆర్ యు సర్?” అని ఇంగ్లీషు లో పలకరించి లోపలి వెళ్లారు.
ఇంతలో కామాక్షి భోజనానికి పిలుపు ఇచ్చింది. అందరూ లోపలి వెళ్ళాం! అక్కడ భోజనాల బల్ల కనిపించక కొంచెం కంగారు పడ్డాను.

ఇంతలో వారి పెరటిలో వున్న అరటి చెట్టు నుండి అపుడే  కోసిన ఆకు పచ్చటి అరిటాకుని  శుబ్రముగా నీళ్ళతో చిలకరించి పీట వేసి భోయనానికి పిలిచి కూర్చోబెట్టారు. ముందుగా వర్రగా పోపు పెట్టిన పసుపచ్చటి మామిడికాయ పప్పుని వడ్డించారు. ఆహా! నా ఫేవరెట్ అనుకున్నాను. తర్వాత మామిడిపప్పుకి ఏమాత్రం తీసిపోకుండా బహుశా వీక్లీ మార్కెట్ లో దగ్గరుండి పొందికగా కొట్టించిన పనసపొట్టుని, ఘాటైన ఆవ పెట్టి, పొడి పొడి లాడేట్టు వండిన పనసపొట్టు కూర వడ్డించారు. అబ్బో! ఎమీ నా భాగ్యం అనుకున్నాను. ఆ తర్వాత మామిడి పప్పుకి, పనసపొట్టు కన్న నేనేమి తక్కువ అంటూ  లేత వంకాయ  అల్లం , పర్చిమిర్చ, కొత్తిమీరతో తనని ఆ పళం గానే దట్టించమని  వయ్యారంగా వచ్చి ఆకులో వాలింది. అబ్బ! ఈ రోజు నక్క తోక తోక్కివచ్చేను అనుకున్నాను.

ఇంతలోకే  పుల్లటి మామిడి కాయలను దగ్గరుండి కొట్టిన్చుకొచ్చి, ఏమాత్రం రాజీ పడకుండా, త్రీ మాంగోస్  వారి ఆవపిండి, ఎర్రదనం కోసం బళ్ళారి కారం, ఎ ఎస్  బ్రాండ్ పప్పు నూనె, అందులో వెల్లుల్లి కూడా దట్టించి, సుబ్రమైన జాడీలో పెట్టి దానికి తెల్లటి గుడ్డ వాసెన కట్టి నా ముందు వుంచి గర్వంగా నిల్చున్నారు.  నేను ఈ ఏటి కొత్త ఆవకాయనంటు నాకు ఒక ప్రత్యేక స్తానాన్ని ఆకులో కల్పించమని కొత్త ఆవకాయ జాడిలోంచి గొంతెత్తి ఘోషిస్తుంటే నేనూరుకుంటానా? వెంటనే వాసెన తీసి నిగ నిగలాడుతున్న ఒక పెద్ద పెచ్చు తీసుకుని  ఆప్యాయంగా ఆకులో వేసుకున్నా.  అంతే కాదండోయ్! మన విశ్వనాధం గారు పని కట్టుకుని గుమ్మడి పండు కోసం మార్కెట్ కి  వెళ్ళి మంచి ఎర్రటి గుమ్మడి పండుని పట్టుకొచ్చి ఘుమ ఘుమ లాడే తియ్యటి దప్పళం, గుమ్మడి ముక్కలకి ఏ మాత్రం దెబ్బ తగిలి ఎనిసిపోకుండా  ముక్కలతో రాచిప్ప(పూర్వం పులుసులు వండేవారు) ప్రత్యక్షమయ్యింది. అవటమే కాదు మిగతా పదార్దాలకేసి ఒక ఓర చూపు  కూడా చూసింది పొండి పెద్ద బడాయి అంటూ. ఆహా! ఇవాళ లేచిన వేళా విశేషం బాగుంది అని రాచిప్ప కేసి ముసి ముసిగా నవ్వుకున్నాను.

ఇంతలోకే   పోండే చుప్పనాతుల్లార!  పండుగలైనా, పబ్బాలైన నాదే ప్రముఖ పాత్ర అంటూ  పూర్ణం బూరె కమ్మటి  నేతి గిన్నెని  చంకలో  పెట్టుకుని వచ్చి  పొందికగా  ఆకులో పీటం వేసుకుని  మరీ కూర్చుంది. అమ్మ బాబోయి! బూరేలే! ఆనందంతో నోట మాట రాలేదు. ఇవన్నే సరే! మరి నేను లేకుంటే ఎంత పూర్ణం బూరెలు వున్నా భోజనం అసంపూర్ణమే సుమా! అంటూ స్టీలు గిన్నెలో అపుడే  కమ్మగా తోడుకున్న గడ్డ పెరుగు పరిగెత్తుకుంటూ వచ్చింది.

వెంటనే విశ్వనాధం "ఇంతటి విందు భోజనములో చెవుల్లోంచి పొగలు వచ్చే పర్చిమిరపకాయ బజ్జీలు లేకపోతె ఎలా?” అంటూ చింతపండు, వాము, నూపొడి కూరి, కూరిమితో చేసిన పొడుగాటి బజ్జీలు తెచ్చి వేసేరు.

ఇంక నా మొహం చూడాలి. అబ్బ! ఎ నాటి పుణ్యమో కదా! ఈ నాడు పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనమే చేస్తున్నాను అని అనుకుంటుంటే, విశ్వనాధం చక్కటి వూరు మిరపకాయలు, గుమ్మడి వడియాలు ఆకులో వేసారు.

“వేసవి కాలం కదా! పెరుగు అన్నంలో  బంగిన పల్లి మామిడి పండు ముక్కలు తింటే భలేగా వుంటుంది అంటూ సూరీడమ్మ గారు మామిడి ముక్కలు తరిగి వేసారు. “డిసెర్ట్ వుండాలి గా అన్నం తిన్నాక”  అంటూ పట్టాభి కిస్స్మిస్స్, జీడిపప్పులతో పాయస పాత్రని వాళ్ళ అమ్మ చేతిలోంచి అందుకుని పక్కన పెట్టాడు.

పాయసం తో పాటు గులాబ్ జాము కూడా తింటే దాని రుచే వేరు అంటూ కామాక్షి  గుండ్రటి గులాబ్ జాములు తెచ్చి పెట్టింది.

ఇంక నా సామి రంగా అంటూ  ఒకసారి దేవుడి కి చేతులు జోడించి, దేవుడా! నువ్వే, నేను ఈ పదార్ధాలకి న్యాయం చేకూర్చేలా చేయి. అంటూ దణ్ణం పెట్టుకున్నాను.
 అమ్మయ్య! అనుకుని భోజనం తృప్తిగా, ఆస్వాదిస్తూ తిని "అన్న దాతలారా! సుఖీ భవ!” అంటూ త్రేంచేను. కామాక్షికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వారందరికి ధన్యవాదాలు తెలుపుకుని బయలు దేరాను.

వెంటనే అన్ని తిని చివరలో ఇది లేకుంటే ఆ విందు భోజనం అరగద్దూ అంటూ లక్ష్మీ కాంతం గారు చక్కటి కర్పూర కిళ్ళీ  ఇచ్చారు. ఆఃహా! అంటూ తాంబూలం కూడా సేవించి అబ్బ నోరు చక్కగా పండింది అని అద్దం లో చూసుకున్నాను.

ఇక ఈ విషయం మాపాఠక మహాశయులకి చేరవేయాలని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకున్నాను.

  


  

Monday, June 15, 2015

పచ్చి టమాటో పప్పు


ముందుమాట:
పండినతరువాతే అన్నీ తినటానికి బావుంటాయనుకోవటం ఎల్లా వేళలా సరికాదు. కొన్ని పచ్చిగా ఉన్నా వాటిని రుచికరంగా చేసుకునే పద్దతులుంటాయి. అలాటి వాటిలోవే పచ్చి టొమాటోలు. టొమాటోలు బాగా పండి ఎర్రగా ఉన్నాకా ఎన్నో రుచికర పదార్దాలు చేసుకోవచ్చు. అయితే కొన్ని సమయాలలో అంగళ్ళలో టొమాటోలు పచ్చివి కూడా వుంటాయి. వాటితో చక్కని రుచికరమైన పప్పు చేసుకోవచ్చు అంటున్నారు శ్రీమతి రత్న. నేను మట్టుకు ఎన్నోసార్లు ఈ పదార్ధాన్ని సేవించి ఆనందించటం జరిగింది.

రమణ బంధకవి
సంపాదకుడు

పచ్చి టమాటో పప్పు 

శ్రీమతి రత్నా శ్రీనివాస్

కావలసిన పదార్దములు:
పచ్చి టమాటాలు                 :   పావు కేజీ 
కంది పప్పు                         :  ఒక కప్పు 
పచ్చి మిర్చి                         :  రెండు
ఉప్పు                                 : తగినంత 
పసుపు                               : చిటికెడు 
కారం                                   : ఒక టీ స్పూన్ 

పోపుకు కావలసిన పదార్దములు :
నూనె                                    : 2 టేబుల్ స్పూన్స్ 
మినపపప్పు                           :  1 టీ స్పూన్ 
ఆవాలు, జీలకర్ర                        :  చెరొక అర టీస్పూన్
మెంతులు లేదా మెంతి పిండి         :  పావు స్పూన్  
ఇంగువ                                  :  సరిపడ
కొత్తి మీర  తురుము                  :    కొంచెం 

తయారు చేయు విధానం:
ముందుగా పచ్చని రంగులో నిగ నిగ లాడే టమేటాలు తీసుకుని శుబ్రముగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఒక బాండీ  తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడెక్కేక  పచ్చి మిర్చి వేసి వేగేక టమేటా ముక్కలు వేసి వేయించి ఉప్పు, పసుపు వేసి కలియ బెట్టి మూత  బెట్టుకుని చిన్న మంట మీద వుంచుకోవాలి. ఈ లోగా ప్రెజర్ పాన్ లో కంది పప్పు వేసి కడిగి, తగినంత నీరు పోసి, చిటికెడు పసుపు వేసి మూత  పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చి పప్పు వుడికిందనుకున్నాక స్టవ్ ఆపెసుకోవాలి.

ఈ లోపు టమేటాలు ఉడికి వుంటాయి. ఒక చిన్న పోపు గరిటలో పైన చెప్పిన పోపు దినుసులతో పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపును వుడికిన టమేటాలు లో వేసుకుని కలుపుకుని  తిరిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్రెజర్ పాన్ మూత  తీసి పప్పు ను బాగా ఎనుపుకుని టమేటా ముక్కల్లో వేసి బాగా కలుపు కోవాలి. ఉప్పు వేసి చివర్లో కొత్తి మీర  వేసి స్టవ్ ఆపెసుకోవాలి. 

పచ్చి టమేటాలు  బాగ పుల్లగా వుండటం వలన చింతపండు వేసుకోనక్కర్లేదు. వేడి అన్నంలో పప్పు కలుపుకుని చల్లమిరపకాయలు కొరుక్కుని తింటే చాల బావుంటుంది.