Tuesday, January 27, 2015

రోటి పచ్చళ్ళలో తలమానికం - దోసకాయ పచ్చడి


ముందుమాట:

దోసకాయ తెలుగు వారికి ఎంత ప్రీతిపాత్రమో చెప్పక్కర్లేదు. దోసకాయ తొ ఏ పదార్ధం చేసినా దర్జాగా నే ఉంటుంది. పప్పు, పచ్చడి, కూర, ఆవకాయ, పులుసు... మరి ఏది చేసినా అదొక ప్రత్యేకత సంతరించు కుంటుంది.  తెలుగు వారి హృదయాలలో మామిడి  కాయ తరువాతి స్థానం దోసకాయదే అని చెప్పటం అతిశయోక్తి కాదు. లోగడ మనం మనసును దోచే దోసావకాయ గురించి తెలుసుకున్నాం. మరి ఈ సంచికలో రోటి పచ్చళ్ళలో తలమానికం అయిన దోసకాయ పచ్చడి గురించి చెపుతున్నారు శ్రీమతి రత్న.

రమణ బంధకవి

సంపాదకుడు



దోసకాయ పచ్చడి


శ్రీమతి రత్నా శ్రీనివాస్


దోసావకాయ రుచులను ఇదివరలోనే తెలుసుకున్నాం గాబట్టి, ఇపుడు దోసకాయ పచ్చడి గురించి తెలుసుకుందాం. ఇది చేయటం చాల తేలిక. చదివాకా ‘ఓ ఇంతేనా?’ అనుకున్నా పరవాలేదు కాని రుఛి చూసి ‘ఇదేనా?’ అని మాత్రం ఎవరూ అనరని నా నమ్మకం!

తయారు చేయటానికి పట్టే సమయం:  15 నిమిషాలు 

కావలసిన పదార్దములు: 
దోసకాయ                                                                  1
చింతపండు                                                                కొంచెం 
ఉప్పు                                                                       తగినంత 
పసుపు,పంచదార                                                        చిటికెడు 

పోపుకు కావలసిన పదార్దములు:
నూనె                                                                        1 టేబుల్ స్పూన్ 
ఎండు మిర్చి                                                              4
మినపపప్పు                                                              1 టేబుల్ స్పూన్ 
ఆవాలు                                                                     1 టీస్పూన్ 
ఇంగువ                                                                     తగినంత 
పచ్చిమిర్చి                                                                3
కొత్తిమీర                                                                    కొంచెం 

తయారు చెయు విధానము :
పచ్చగా గుండ్రం గా ఉన్న దోసకాయను ఎంచుకోండి. కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరిగే సమయం లోనే, ముక్క రుచి చూసి చేదు లేదని నిర్ధారించుకోవాలి. గింజలు కావాలనుకునే వారు ఉంచుకోవచ్చు. లేని పక్షంలో పూర్తిగా తీసేయాలి. తరిగిన ముక్కలపైన పసుపు, ఉప్పు, పంచదార వేసుకోండి. చింతపండు కడిగి అది కూడా వేసుకోవాలి.

ఓకే చిన్న పోపు మూకుడును తీసుకుని, నూనె వేసి, వేడేక్కేక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు చల్లారక, కొంచెం పోపును పక్కన పెట్టుకుని, మిగతా పోపును బరకగా గ్రైండ్ చేసుకుని, దానికి పచ్చి మిర్చి, చింత పండు, కొత్తిమెర జతచేసి మల్లి రుబ్బుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలను కూడా కలిపి నలిగీ నలగనట్లు  ఒక సారి తిప్పి తీసేసుకోవాలి. 

పాతకాలం రోలు ఉన్నవారు, చక్కగా ఈ మిశ్రమాన్ని, ముక్కలను రోటిలో వేసుకున్ని, కచ్చ పచ్చగా దంచుకుంటే అద్వితీయంగా ఉంటుంది. మిక్సీ లో తిప్పుకునే వారు బహు జాగ్రత్తగా తిప్పుకోవాలి. లేకపోతే పలుచగా జావ లాగ అయిపోతుంది.  తయారైన పచ్చడిని శుబ్రమైన గిన్నె లోకి తీసుకుని, వేరే అట్టే పెట్టిన పోపును పైన వేసి అందంగా అలంకరించుకోవాలి. ఇక నోరూరించే దోసకాయ పచ్చడి తయార్! దీన్ని వేడి అన్నంలోకి నేయి జోడించి తింటే అద్భుతః













Saturday, January 24, 2015

మరుగున పడుతున్న పర్వదినాలు — రధసప్తమి


ముందుమాట: 
మనం  ఇటీవలే మరుగున పడుతున్న కొన్ని పర్వదినాలను వెలికి తీసే ప్రయత్నం చేసాము కదా? నిన్ననే శ్రీ పంచమి గురించి చెప్పుకున్నాం. అలాంటి జాబితాలో మనం ఆధునిక వ్యామోహం లో వదిలేసిన ధార్మిక పరంగానూ శాస్త్ర పరం గానూ కూడా ఎంతో అర్ధవంతమైన ఆధ్యాత్మిక పర్వదినం 'రధసప్తమి'కూడా ఉందని చెప్పుకోవచ్చు. తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం నుండి మీరు పవిత్ర మైన ఈ పండుగ ‘రధసప్తమి’ ని ఆచరించి, మీ పిల్లలకు కూడా తెలియజేయండి. ఎలా? అని అనుకుంటున్నారా? “ఎందుకు మీకా చింత? 'తెలుగుభోజనం' వుండగా మీ చెంత!”  మీకు 'రధసప్తమి' యొక్క విశిష్టత, ఆచరించే విధి విధానం, శాస్త్రీయ దృక్పధం,  సమయం .... మొదలైన సమాచారం తో అందిస్తున్నారు శ్రీమతి నయన కస్తూరి.


రమణ బంధకవి


సంపాదకుడు



‘రధసప్తమి’

శ్రీమతి నయన కస్తూరి

మాఘమాసం లో ఏడవ రోజైన శుక్ల సప్తమి నాడు హిందువులు ఈ పండుగ చేసుకుంటారు. సూర్యభగవానుడు తన సప్తాశ్వరధం మీద ఉత్తరాయణంలో ఈశాన్య దిశగా పయనం సాగిస్తున్న సందర్భం లో ఈ రోజున సూర్యారాధన కావిస్తారు. ఇదే రోజున కశ్యపునికి, అదితికి సూర్యభగవానుడు జన్మించాడని భావించి, భక్తీ శ్రద్ధలతో సూర్య జయంతి ని కూడా జరుపుకుంటారు.

ఇప్పుడు రధసప్తమి పూజా విధానం చూద్దాం. ఈ రోజు సూర్యోదయానికి ముందరే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, రధసప్తమీ స్నానాలు చేస్తారు. అవకాశం ఉన్న వారు నదీస్నానం, సముద్రస్నానం చేస్తారు. ఇలా చేయడం వలన ఏడుజన్మలనుండి  వెంటపడుతున్న పాప సముదాయం నుండి కూడా విముక్తి పొందగలరుట. అంతటి మహదావకాశం అందరికి దొరుకుట  దుర్లభం! ఒప్పుకుందాం. అందుకే దయాహృదయుడు అయిన ఆ భగవంతుడే ఫలితంలో ఏ మాత్రం లోపం లేకుండా ఎన్నో సులభ మార్గాలు మనకు అందుబాటులో ఉంచుతాడు. అరుణోదయానికి ముందే రధసప్తమి నాడు లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, జిల్లేడు ఆకులు కాని, రేగిపళ్ళు కాని శిరస్సున దాల్చి, ఈ క్రింది శ్లోకాన్ని పటిస్తూ తల స్నానం చేస్తే మీ పాపాలన్ని పటాపంచలు  అయిపొతాయి. మరి అయితే ఆ శ్లోకం ఏమిటో ఒకసారి చూద్దామా?

"యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తస జన్మసు,
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ!"

అయితే మరి రధసప్తమి నాడు ఈ విధం గా స్నానం ఆచరించి, ఏడు జన్మల పాపాలనుండి విముక్తి పొందుదాం.   

ఇక సూర్యోదయం అవగానే ఇంటి ఆవరణలోనే ఉన్న తులసి మొక్క చెంత ఏడు  పద్మాలు బియ్యం పిండితో ముగ్గుగా వేసి రెండేసి చిక్కుడు కాయలను రెండేసి చిన్న పుల్లలతో కలిపి అలా తొమ్మిది జతల చిక్కుళ్ళ తో ఏడు  అశ్వాలు కలిసిన రధం లాగా తయారుచేసి, ఒక చిక్కుడు ఆకుమీద ఒక ఎర్రపుష్పాన్ని సూర్యునికి ప్రతినిధిగా కుంకుమ గంధాలతో అలంకరించాలి. ధనుర్మాసం అంతా పిడకలుగా చేసిన గొబ్బెమ్మలతో అగ్నిని ప్రజ్వరిల్లంప చేసి, దాని మీద ఆవుపాలుని పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పరమాన్నం చేసి చిక్కుడు ఆకులో సూర్యభగవానుడికి నివేదన చేసి, ప్రసాదం గా కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు. చిక్కుడు ఆకులే ఎందుకు? అని మీలో ఒక సందేహం ఉదయించవచ్చు. ప్రస్తుతానికి నా సమాధానం ఏమిటంటే, మన సంప్రదాయం ఏదైనా దానికి శాస్త్రీయపరమైన కారణం వుంటుంది. అప్పుడే చిక్కుడు కాయల కాపు మొదలవుతుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన కాయగూర చిక్కుడు. అది మనం మర్చిపోకుండా సూర్యారాధన లో పొందుపరిచారు. దీని గురించి ఇంకొంచెం వివరంగా ఇంకోసారి ఎప్పుడైనా తెలుసుకుందాం. సూర్యరశ్మి ఎన్నో రోగాలను హరించే శక్తి కలిగి వుంటుంది. సూర్యరశ్మి లేకపోతె జీవశక్తి మనలేదు. రకరకాల వ్యాధులు సోకుతాయి. ప్రాతఃకాలం లోని సూర్యరశ్మి లో  'డి' విటమిన్ పుష్కలం గా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గరనుండి ‘ఏసీ’ లకు కంప్యూటర్లకు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి, అవుట్ డోర్ గేమ్స్ ని పూర్తిగా మర్చిపోయి సూర్యరశ్మి ఏ మాత్రం శరీరానికి సోకకుండా వుండటం వలన అందరికి 'డి'విటమిన్ తగ్గిపోయి అనేక ఎముకల రోగాలకు దారి తీస్తోంది. చలికాలం లో కలిగే రుగ్మతలను తర్వాత వచ్చే వేసవికాలం చాలా వరకు అరికడుతుంది. రధసప్తమి తర్వాత వాతావరణం లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆరుబయట అర్చన మన శరీరాన్ని పెరగబోయే  ఉష్ణోగ్రతల కు  అలవాటు చేస్తుంది. మనం మనిష్టమొచ్చిన విధంగా సహజవనరులను దుర్వినియోగం చేస్తే వాతావరణం లోని సమతుల్యత దెబ్బతిని, అన్ని కాలాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. అది మనం గ్రహించి, గుర్తు పెట్టుకోవడానికే మనం సంప్రదాయం, మన పెద్దలు ఎంతో శాస్త్రీయపరం గా ఆలోచించి, మన పండుగలలో ప్రకృతి ఆరాధనను  అంతర్భాగం గా చేసారు. 

రధసప్తమి యొక్క ఇంకొక విశిష్టత ఏమిటంటే మన స్త్రీలు ఎన్నో నోములు నోస్తూ వుంటారు కదండీ? వారు ఆ నోములు ఈ రోజే సూర్యభగవానుని సాక్షిగా పెట్టుకుని తాము  చేసుకోబో యే నోములకు సంకల్పం చెప్పుకుని ప్రారంభిస్తారు. ఏ కారణం చేతనైనా ఈ రోజు ప్రారంభించలేని వారు మాఘ మాసం లోని ఏ ఆదివారం నాడు అయినా లేక మహా శివరాత్రి నాడు అయినా ప్రారంభించు కోవడం మన ఆచారం!

ఇంతటి విశిష్టత కలిగిన రధసప్తమి ఈ నెల అనగా జనవరి 26 న పడింది. మరి మర్చిపోకుండా ఆ రోజు మన ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలతో పాటు  యధాశక్తి  సూర్యభగవానుని ఆరాధించి "ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్” అని మరిచిపోకుండా నిత్యం సూర్యనమస్కారాలు చేసుకుంటూ  ఆరోగ్యమనే మహా భాగ్యాన్ని పొందుదామా?







Friday, January 23, 2015

మరుగున పడుతున్న మన పర్వ దినాలు: చదువుల తల్లి పుట్టిన రోజు – శ్రీ పంచమి


ముందుమాట: 
రెండున్నర దశాబ్దాల క్రిందట మాట; నేను ఉద్యోగ రీత్యా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నప్పుడు, ప్రతి ఏట మాఘ పంచమి నాడు ఎంతో భక్తి శ్రద్దలతో విశేషంగా జరపబడే సరస్వతి పూజ నాకు బాగా గుర్తు. ఆ రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవ ఉండేది. అందరూ ఆ చదువులతల్లి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరుపుకునే వారు. ఈ నాటి రోజులలో ఈ పండగ కొంచెం మరుగున పడిందనే చెప్పవచ్చు.  విద్యా, విజ్ఞాన, వాక్పటిమలను మరియు ధారణ శక్తిని ఇచ్చి మనకు సరైన దారి చూపించే ఆ తల్లి జన్మదిన విశేషాలను మన ‘తెలుగు భోజనం’ పాఠకులకు శ్రద్దగా వివరిస్తున్నారు శ్రీమతి నయన. చదివి ఆ తల్లిని పూజించి తరించుదాము. 

రమణ బంధకవి

సంపాదకుడు

 

‘శ్రీ పంచమి లేక వసంత పంచమి’


శ్రీమతి నయన కస్తూరి


మహా పవిత్రమైన మాఘ మాసం లో మనం జరుపుకునే విశేష పర్వదినములలో  తొలుతగా వచ్చేది 'శ్రీ పంచమి'.  ఈ పర్వదినం గురించి చాలా మందికి తెలిసేవుంటుంది. అయితే ఈ ఆధునిక యుగం లో మనకు వేరే ఆరాటాలు ఎక్కువై కొన్ని పాశ్చాత్య పండుగల అనుకరణ లో పడి మనవైన  చాలా పర్వదినాలను ఒక విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామనే చెప్పుకోవాలి. అట్టి వాటిలో శ్రీపంచమి ఒకటి. శ్రీపంచమి ఏమిటో ఎప్పుడు ఎలా జరుపుకోవాలో ఒక్క సారి గుర్తు చేసుకుందాము. ప్రతీ చాంద్రమాన సంవత్సరం లోని మాఘమాసం లోని ఐదవ రోజు అంటే శుక్ల పంచమి నాడు ఈ పర్వదినాన్ని ఆచరిస్తాము.  ఈ రోజు యొక్క విశేషమేమంటే చదువులతల్లి, సకల కళారాణి అయిన  సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజు గా పరిగణింప బడే రోజు! ఈ రోజు పిల్లల చేత సరస్వతీ దేవి పూజ చేయిస్తే పిల్లలు చక్కగా చదువుకుని జీవితంలో పైకి వస్తారని హిందువుల ప్రగాఢ విశ్వాసం! 

'శ్రీ పంచమి' నే 'వసంత పంచమి' అని,సరస్వతీపూజ' అని కూడా పిలుస్తారు. నిజానికి మాఘ ఫాల్గుణ మాసాలు  శిశిర ఋతువు కాలం. అయితే మరి ఈ మాఘ శుక్ల పంచమిని వసంతపంచమి అని అనడం  ఏమిటిన్న సందేహం మీకు కలగవచ్చు. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలిపోయి కొత్తచిగుళ్ళు  రావడం మొదలుపెడతాయి. వాతావరణం అంతా ఆహ్లాదకరం గా వుండి వసంత ఋతువు రాకకు ఎన్నో సంకేతాలు ఈ మాసం లోనే మనకు కనిపిస్తాయి. అందుకని సరస్వతీ దేవి పుట్టినరోజైన ఈ పంచమిని  'వసంత పంచమి' అని కూడా అంటారు. సరస్వతీ దేవి పుట్టినరోజు కనుక విశేషంగా ఈ దేవి ఈ రోజున పూజలందుకుంటుంది కనుక 'సరస్వతీ పూజ'అని పిలువబడుతుంది.

అన్ని సరస్వతీదేవి ఆలయాల్లో ఈ రోజు విశేష పూజలు నిర్వర్తిస్తారు. భక్తులందరూ తమ పిల్లలతో సరస్వతీ దేవి పూజలు చేయిస్తారు. చిన్న పిల్లలకైతే ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేయిస్తే తమ పిల్లలు ఉన్నత విద్యలు అభ్యసిస్తారని, చదువుల తల్లి అనుగ్రహం పొందుతారని తల్లితండ్రుల నమ్మకం! అంతే  కాకుండా వాగ్దేవి అనుగ్రహంతో సంగీతము, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం... లాంటి ఎన్నో కళలలో ఉన్నతస్థాయిని అధిరోహిస్తారని హిందువుల విశ్వాసం! అందుచేత ప్రతి ఒక్కరు సరస్వతీదేవిని ఆశ్రయిస్తారు. విశేషించి ఈ శ్రీ పంచమి నాడు అమ్మ వారికి అభిషేకాలు జరిపి నిజ రూపానికి హరిద్రాలంకారం అంటే పసుపు అమ్మవారికి వంటినిండా అలది కొంచెం సేపు అందరికి హరిద్రదర్శనం గావిస్తారు. ఈ అలంకరణ లో అమ్మవారి దర్శన భాగ్యం ఎంతో జయప్రదం మరియు పుణ్యప్రదం అని భావిస్తారు. భక్తులు తండోప తండాలుగా అమ్మవారి ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యార్ధుల చేత సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. వార్షిక పరీక్షలముందు ఈ పండుగ రావడం వలన, విద్యార్ధులందరూ కలిసి చేసుకోవడం వలన, తోటి విద్యార్ధులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకోవడమే కాకుండా కొత్తపద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుని రిలాక్స్ అవుతారు. ఆరోగ్యకరమైన పోటీ పడతారు. తోటి విద్యార్ధుల నుండి ప్రేరణ పొందుతారు. మార్చ్, ఏప్రియల్ లో స్కూల్స్ లో కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్స్ జరుగుతాయి కనుక దాని ముందుగా వచ్చే ఈ శ్రీపంచమి నాడు అక్షరాభ్యాసాలు, పూజలు చేసుకుని చదువుల పోరాటానికి సంసిద్దులవుతారు.

ఈ రోజు అమ్మవారికి పసుపురంగు ప్రీతికరమైనందున భక్తులు వీలైనంతవరకు పసుపురంగు వస్త్రాలు ధరించి, పసుపు వేసిన పులగాన్నాన్ని నివేదన చేస్తారు. పులగాన్నం తయారీని మన దసరా నవరాత్రులలో నేర్చుకున్నాం కదా? ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. 

ఇంత  విశిష్టమైన సరస్వతీదేవి పుట్టినరోజుగా పరిగణింప బడే 'శ్రీ పంచమి' ఈ నెల అనగా జనవరి 24 మరియు 25 తేదీలలో [రెండు రోజులలో పంచమి ఘడియలు ఉన్నందున] పడినందున అందరు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కోలుచుకుని, ఆ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాము.