Monday, November 24, 2014

‘జీర్ణ కారిణి – అల్లం చట్నీ’


ముందు మాట:

“సార్ కి పెసర రోస్ట్, అల్లం చట్నీ స్పెషల్!” అని ఆదివారం పొద్దుట నేను టిఫిన్ కి వెళ్ళినప్పుడు మా వీధి చివర రాఘవేంద్ర భవన్ రమేష్ వాళ్ళ పని వాళ్ళకి పురమాయించడం కద్దు! తెలుగునాటి అల్పాహారాలు; ముఖ్యం గా పెసరట్టు, వడ, మైసూరు బజ్జి, ఇడ్లి, తమ ప్రియతమ సఖి అయిన ‘అల్లం చట్నీ’ కైవారం చెయ్యకుండా పళ్ళెం లోకి వేంచేయటం అరుదు. ఇక ప్రాంతానుసారం, కొన్ని చోట్ల అరుణ వర్ణం లోను, మరి కొన్ని చోట్ల ఆకుపచ్చ వర్ణం లోను దర్శనం ఇవ్వటం చూస్తూ ఉంటాం. అలాగే, ఒక్కోసారి పొగరైన కారం పులుపు రుచుల సమ్మేళనం గా ఉంటే, మరి కొన్ని తావులలో నమ్రత గా బెల్లపు తీపి తనాన్ని కలుపుకుని జిహ్వకి గిలిగింతలు పెడుతుంది.  మరి అటువంటి చట్నీ తయారీ గురించి రత్న గారు ఏమి చెపుతున్నారో చూద్దామా?

రమణ బంధకవి

సంపాదకుడు



‘అల్లం  చట్నీ’


శ్రీమతి రత్నా శ్రీనివాస్

అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలిసిందే! దీన్ని జీర్ణకారిగా పరిగణిస్తారు. అలాంటి అల్లంతో పచ్చడి చేయటం తెలుసుకుందాము.


కావలసిన వస్తువులు :
అల్లం                                                          25 గ్రాములు
చింతపండు                                                  50 గ్రాములు
ఉప్పు                                                         రుచికి సరిపడా
బెల్లం                                                           30 గ్రాములు

పోపుకు కావలసిన వస్తువులు :

నూనె                                                          4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు                                                2  టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి                                                 10-12
ఆవాలు                                                       2 టీస్పూన్స్
ఇంగువ                                                      1 టీస్పూన్
మెంతులు                                                   1 టీస్పూన్

తయారు చేయటానికి పట్టే సమయం :             15 నిమిషాలు

తయారు చేసే విధానం: 

ముందుగా అల్లాన్ని శుబ్రంగా మట్టి పోయేలాగా కడిగి చెక్కు తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. చింతపండును కడిగి ఒక కప్పులోతగినంత నీరు పోసి నానబెట్టుకోవాలి. ఒక బాణలి తీసుకుని నూనె వేసుకుని వేడిక్కిన తరువాత మెంతులు వేసి రంగు మారేక మినపపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. తరువాత ఆవాలు వేసి చిటపటలాడేక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆఖరుగా ఇంగువ వేసి స్టవ్ ఆపుచేసుకోవాలి.

పోపును వేరొక పాత్రలోకి తీసుకుని, అదే బాణలి లో నానపెట్టిన చింతపండును పిసికి ఆ గుజ్జును వేసి మరగబెట్టుకోవాలి.  చింతపండు పులుసు మరుగుతున్నప్పుడే బెల్లం కూడా వేసుకోవాలి.  రెండింటి మిశ్రమము మరిగి గుజ్జులాగా అయిన తరువాత స్టవ్ ఆపెయ్యాలి.
పోపు చల్లారిన తరువాత, మిక్సీ లో పోపుని తిప్పుకోవాలి. తరువాత తరిగిన అల్లం ముక్కలు, చింతపండు-బెల్లం  గుజ్జు, తగినంత ఉప్పు వేసి మిక్సీ లో తిప్పుకోవాలి. నలిగిన పచ్చడిని తీసుకుని ఒక మంచి పాత్రలోకి మార్చుకోవాలి.

సలహాలు:
1.అల్లం పచ్చడిని వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాల రుచిగా వుంటుంది.
2. దీనిని ముద్ద పప్పులో నంచుకుని తింటే పప్పు రుచి ద్విగుణీకృతం అవుతుందనటంలో సందేహం లేదు
3. వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేసినప్పుడు, దాని మీద నెయ్యి వేసుకుని అల్లం చట్నీ నంచుకుని చూడండి. ఆ మజానే వేరు.
4. దీనిని చపాతీ, పరాటా,ఇడ్లీ, దోసలల్లోకి కూడా నంచుకుని తినవచ్చును. దీనిని కొందరు ఏడాది నిలువ పచ్చడి గా కూడా పెడతారు. ఐతే అందులో మినపపప్పు పోపులో వేయరాదు.
5. పైన చెప్పిన పచ్చడి ఫ్రిజ్ లో వుంచితే వారం, పది రోజుల పాటు నిలువ చేసికొనవచ్చును.




  












No comments:

Post a Comment