Tuesday, August 26, 2014

వినాయక చవితి - 'నాడు- నేడు' - ప్రత్యేక వ్యాసం



ముందు మాట:

ముందుగా పాఠకులందరికి భాద్రపద మాసపు శుభాకాంక్షలు!

శ్రావణ మాసపు వ్రతాలూ, నోములు, పెళ్ళిళ్ళ సందడి నుండి విశేష పర్వదినాల భాద్రపదం లోకి 

అడుగు పెట్టాము.  భాద్రపదం అనగానే ఎవరికైనా గుర్తుకువచ్చేది వినాయక చవితి పండుగ.  

“దండాలయ్య ఉండ్రాళయ్యా!” అంటూ మనం ఏ పని అయినా మొదలు పెడతాం. తరాల 

అంతరాలలో ఈ పండగ కూడా ఎంతో మార్పు సంతరించుకుంది. మరి ఈ మార్పుకి అద్దం పట్టి 

మనకి చూపిస్తున్నారు మన బామ్మ గారు. అదేమిటో మనం చదివి తెలుసుకుందామా?


రమణ బంధకవి


సంపాదకుడు





బామ్మ గారి కార్నర్:




వినాయక చవితి- 'నాడు- నేడు' 



శ్రావణ మాసం అంతా ఆడవారికి పండగల సందడి అయితే భాద్రపద మాసంలో శుద్ధ చవితితో  మొదలయ్యే గణపతి నవరాత్రుల్లో మగ వాళ్ళ సందడే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మా రోజుల్లో జరుపుకున్న గణపతి నవరాత్రులకు ఈ నాడు మనం జరుపుకుంటున్న నవరాత్రులకు ఎక్కడా పోలిక లేదనే విషయం కనబడుతుంది.

ఆ రోజుల్లో  వినాయకచవితి నాడు తెల్లవారు జామునే అందరి ఇళ్ళల్లోని మగ పిల్లలంతా నిద్ర లేచి,  ఊరిలోని అందరి ఇళ్ళల్లోని దొడ్లల్లోని  చెట్ల నుండి కావలిసిన పత్రి ని  తెంపుకుని, సంచులలో  నింపుకునిఆనందంగా తల్లికి ఇచ్చేవారు. ఊరు నిండా మామిడిచెట్లు, రకరకాల పూలమొక్కలు, గరిక ఉండేవి.  ప్రతి ఊరులో ఒక చెరువు, చెరువు నిండా దుప్పటి కప్పినట్టుగా కలువ పూలు, చెరువు గట్టు మీద వినాయుకునికి ఎంతో  ప్రీతికరమైన  జిల్లేడు మొక్కలు ఉండేవి.  జిల్లేడు ఆకులు, కాయలు, కలువపూలు ఒకటేమిటి,  కావలిసినవన్నీ స్వహస్తాలతో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా తాజాగా తెచ్చుకునే వారు. 

చవితి నాటి తెల్ల వారుజామునే ముద్రతో చేసిన మట్టి వినాయకుని ప్రతిమలు అమ్మే వారు. వినాయకుడు రాత్రి నిద్ర చేయకూడదని అందరు అదే రోజున కొనే వారు. కుటుంబ సభ్యులంతా తలారా స్నానాలు చేసి, మడిగా ఆరేసుకున్న వస్త్రాలు ధరించి, తల్లి వంట పదార్ధాలు, ప్రసాదాలు సిద్ధం చేస్తుంటే, తండ్రి, పిల్లలు కలిసి పూజకు అంతా సిద్ధం చేసుకునే వారు.

వెదురు బద్దలతో చేసిన పాలవెల్లిని కట్టేవారు. నాలుగు పక్కలా అరటి పిలకలు, మామిడి ఆకులు అలంకరించే వారు. పీట కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పైన కాసిని బియ్యం పోసి, గణపతిని ఆసీనులు కావించేవారు. పాలవెల్లికి మొక్కజోన్న పొత్తులు, వెలగ పళ్ళు , మారేడు కాయలు, జామ, దానిమ్మ, బత్తాయి పళ్ళు దారాలతో కట్టి వేళ్ళాడదీసే వారు.

పూలు, పళ్ళు , పత్రి, పళ్ళాలలో పోసుకుని దేవుడి దగ్గర ఉంచేవారు.  వడపప్పు, పానకం, చలిమిడి, అటుకులు,  చెరకు ముక్కలు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాలతాలికలు, కొబ్బరికాయలతో పాటు అనేక రకాల పిండి వంటలతో కూడిన మహానైవేద్యం సిద్దం చేసేది గృహిణి. పిల్లలు పుస్తకాలు, పెన్నులు;  పెద్దలు పర్సులు, ఖాతా పుస్తకాలు; వినాయకుని దగ్గర పూజలో పెట్టుకునే వారు. గృహస్తు భక్తిగా వినాయకునికి పూలతో, ఇరవై ఒక్క రకాల పత్రితో  పూజచేసి, వినాయుకుని  వ్రత పుస్తకం లోని వ్రత కథ చదువుతుంటే తల్లి, పిల్లలు చేతిలో అక్షింతలతో శ్రద్ధగా వినే వారు. పూజ అంతా అయ్యాక అక్షింతలు కొన్ని గణపతి  మీద వేసి, మరికొన్ని  తమ శిరస్సుల మీద  వేసుకుని, వాటి మహాత్మ్యం  వలన  నీలాపనిందలు రాకుండా తప్పించుకునే వారు. పిల్లలు, పెద్దలు పోటీ పడి గుంజీలు తీసేవారు.


ఆ రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు  వస్తాయని చూడకుండా జాగ్రత్త పడేవారు. సాయంకాలం మళ్ళీ  కథ చదువుకుని, అక్షింతలు వేసుకునే వారు. పూజ గావించిన వినాయకుని ప్రతిమను తమ వీలు కొలది ఒకటి, మూడు, అయిదు, తొమ్మిది రోజులు వుంచి, తమ ఇంటి పెరటులోని బావిలో కానీ, తమ ఊరు చెరువులో కానీ భక్తి శ్రద్దలతో నిమజ్జనం  కావించేవారు. 

(సశేషం)



No comments:

Post a Comment